China Covid- 19 | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ అదుపులోకి వచ్చినప్పటికీ.. కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అవలంభిస్తూ.. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఆంక్షల నేపథ్యంలో లక్షల మందిని ఇళ్లకే పరిమితం చేసింది. లక్షణాలున్న వారిని నగరానికి దూరంగా ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్లనీయడం లేదు. దీంతో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కఠిన ఆంక్షల మధ్య సమయానికి వైద్యం అందక నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో అక్కడి ప్రభుత్వంపై చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని ఝేంగ్జువా నగరంలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇలాగే ఓ కుటుంబం నగరానికి దూరంగా ఉన్న హోటల్లో క్వారంటైన్లో ఉంది. ఈ క్రమంలో వారి నాలుగు నెలల పాప అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చిన్నారికి ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోయారు. పాపను ఆసుపత్రిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ కరోనా ఆంక్షల కారణంగా వారు బయటకు వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. 11 గంటల పాటు వేడుకున్నాక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆరోగ్యం విషమించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఇటీవల లాంఝువా నగరంలోనూ ఈ తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. క్వారంటైన్లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అడ్డుకోవడంతో.. పరిస్థితి విషమించి ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బారికేడ్లను తొలగించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. వారి ఆందళనతో దిగివచ్చిన చైనా ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటన మరవకమేందే ఇప్పుడు ఝేంగ్జువా నగరంలో చిన్నారి మృతి చెందండంతో చైనీయులు అక్కడి ప్రభుత్వంపై మరోసారి తిరగబడుతున్నారు.