బీజింగ్: ఆసియా దేశాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల తుఫాన్లు బీభత్సం(Deadly Storms) సృష్టిస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. దక్షిణ చైనాలో తాలిమ్ టైఫూన్ దూసుకెళ్తోంది. దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం చైనాలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
జిన్జియాంగ్లో ఇటీవల 52 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతనమోదు అయ్యింది. మరో వైపు తాలిమ్ టైపూన్ వియత్నం దిశగా వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ రూట్లో దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దక్షిణ కొరియా వరదల్లో డజన్ల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ నేతలు వాతావరణ మార్పులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక యూరోప్, అమెరికాలో తీవ్ర స్థాయిలో ఎండలు మండుతున్నాయి. ఆగస్టు వరకు యురోప్ అంతటా హీట్వేవ్ ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ ఏజెన్సీ తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూఎన్ చెప్పింది. అమెరికాలోని సౌత్వెస్ట్ ప్రాంతంలో లక్షలాది మంది హీట్ సమస్యతో బాధపడుతున్నారు.