యూరప్ : అరుదైన “ఒమేగా బ్లాక్” వాతావరణ నమూనా కారణంగా ఏర్పడిన ప్రాణాంతక, రికార్డు స్థాయి హీట్వేవ్ బుధవారం పశ్చిమ యూరప్ను మరింతగా కమ్మేసింది. కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోగా రవాణా, విద్యుత్తు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు మూతపడ్డాయి. పలు దేశాలు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేశాయి. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఆరోగ్యవంతులైన పెద్దలకూ తీవ్ర వేడి ప్రమాదకరంగా మారవచ్చని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం రాబోయే రోజుల్లో మరిన్ని ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. గత 80 ఏండ్ల ఫ్రాన్స్ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత మంగళవారం నమోదైంది. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఈ హీట్వేవ్కు సంబంధించి కనీసం 50 మరణాలు నమోదయ్యాయి. చల్లదనం కోసం నీటి వనరుల్లోకి వెళ్లిన 48 మంది మునిగి మరణించగా, కారులో వదిలిన ఇద్దరు చిన్నారులు తీవ్ర వేడి కారణంగా మృతిచెందారు.
స్పెయిన్లో ఇద్దరు వృద్ధులు వడదెబ్బ కారణంగా మరణించారు. అక్కడ వారాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు బుధవారం నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. ఫ్రాన్స్లోని బ్రిటనీ ప్రాంతంలో వేడి కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడటంతో వేలాది ఇండ్లకు విద్యుత్తు పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి. ఐఫిల్ టవర్, లూవ్రా మ్యూజియం వంటి ప్రధాన పర్యాటక కేంద్రాలు సందర్శన సమయాలను పరిమితం చేశాయి. బ్రిటన్లో అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో జారీ చేసే “రెడ్ హీట్ హెల్త్” హెచ్చరికను దేశ చరిత్రలోనే రెండోసారి జారీ చేశారు. దక్షిణ ఇంగ్లండ్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉన్నదని అంచనా. పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. రైలు సర్వీసులు రద్దయ్యాయి. అధిక వేడి కారణంగా రైల్వే పట్టాలు వంగిపోవడం, విద్యుత్తు తీగలు జారిపోవడం వంటి ప్రమాదాల వల్ల గణనీయమైన అంతరాయం ఏర్పడవచ్చని నెట్వర్క్ రైల్ హెచ్చరించింది. “అసలు తీవ్రమైన పరిస్థితి ఇంకా ముందుంది” అని మెట్ ఆఫీస్ వాతావరణ శాస్త్రవేత్త అలెక్స్ బర్కిల్ వ్యాఖ్యానించారు.
ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోమ్, మిలాన్, ఫ్లోరెన్స్, ట్యూరిన్ సహా 16 నగరాలకు అత్యున్నత స్థాయి “రెడ్ అలర్ట్” జారీ చేసింది. మధ్య, ఉత్తర ఇటలీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. టస్కనీ, ఎమిలియా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చు. లిగూరియా వంటి తీర ప్రాంతాల్లో అధిక తేమ కారణంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని అంచనా. ఈ తీవ్ర పరిస్థితులకు ఒమేగా బ్లాక్ అనే అరుదైన వాతావరణ పరిస్థితే కారణం. రాయిటర్స్ ైక్లెమేట్ మానిటర్ ప్రకారం యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కాలానుగుణ సగటుతో పోలిస్తే 18 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు 2003 ఆగస్టులో సంభవించిన విధ్వంసకర హీట్వేవ్ను గుర్తుకు తెస్తున్నాయి. ఆ హీట్వేవ్ 16 రోజులపాటు కొనసాగి యూరప్ వ్యాప్తంగా సుమారు 80,000 అదనపు మరణాలకు కారణమైందని అంచనా. ఈ వేడి ప్రభావం యూరప్ అంతటా దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. కార్మికుల రక్షణ కోసం నిర్మాణ సంస్థలు పని గంటలను మార్చా యి. ఫ్రాన్స్లోని ఒక వ్యవసాయ సహకార సంస్థ రాత్రివేళల్లో పంట కోతలు ప్రారంభించింది. పారిస్ ఫ్యాషన్ వీక్ జరుగుతున్న నేపథ్యంలో డియోర్, రిక్ఓవెన్స్ వంటి లగ్జరీ బ్రాండ్లు తమ కార్యక్రమాలను ఉదయం వేళలకు మార్చాయి. లూయీ విట్టన్ ప్రదర్శనలో ప్రేక్షకులు తీవ్ర వేడితో ఇబ్బంది పడినట్టు కనిపించారు. స్విట్జర్లాండ్ కూడా అత్యవసర చర్యలు చేపట్టింది. కొన్ని స్థానిక సంస్థలు పగటి సమయంలో ప్రజలకు ఉచితంగా ఎయిర్ కండీషన్డ్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారిని సేదతీర్చింది. ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం యూరప్ ప్రపంచ సగటుతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా వేడేక్కుతున్నది.