న్యూఢిల్లీ, జూలై 7: కొంత మందికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆవు, గేదెల పాలు అరగవు. పాలు తాగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. దీనికి పాలల్లో ఉండే బీటా-లాక్టోగ్లోబులిన్(లాక్టోజ్) కారణం. అజీర్తికి కారణమయ్యే ఈ లాక్టోగ్లోబులిన్ లేకుండా పాలను ఉత్పత్తి చేసేలా రష్యా పరిశోధకులు ఆవు జన్యువుల్లో మార్పులు చేశారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా క్లోనింగ్ ద్వారా 2020లో ఓ ఆవుదూడను పుట్టించారు. దీనికోసం సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్(ఎస్సీఎన్టీ) విధానం ఉపయోగించారు. పాలు ఉత్పత్తి అయ్యే క్రమంలో బీటా-లాక్టోగ్లోబులిన్ కారకాలైన జన్యువులను తొలగించారు. దీనికోసం నోబెల్ ప్రైజ్ వచ్చిన CRISPR/Cas9 అనే టెక్నాలజీని ఉపయోగించారు. పుట్టినప్పుడు 63 కిలోలు ఉన్న ఆ దూడ ప్రస్తుతం 410 కిలోలు ఉన్నది. అది పూర్తి ఆరోగ్యంగా ఉన్నదని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సాధారణంగానే పనిచేస్తున్నదని పరిశోధకులు తెలిపారు. ఇది లాక్టోజ్ రహిత పాలను అందించనున్నదని చెప్పారు. ఈ ఆవు ద్వారా ఇలాంటి మరిన్ని ఆవులను వృద్ధి చెందించనున్నట్టు పేర్కొన్నారు.