కోపెన్హెగన్: యూరోప్లో కోవిడ్ మహమ్మారి తుది దశకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వల్ల యూరోప్ దేశాల్లో కోవిడ్19 ఓ కొత్త దశకు చేరుకున్నదని, తర్వలో ఆ దశ ముగిసే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో యూరోప్ డైరక్టర్ హాన్స్ క్లూజ్ తెలిపారు. ఈ ప్రాంతంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే దశలో ఉందన్నారు. అయితే మార్చి నాటికి సుమారు 60 శాతం మంది యురోపియన్లకు ఒమిక్రాన్ సోకుతుందని, ఆ తర్వాత కరోనా స్తబ్దుగా మారుతుందని ఆయన అన్నారు. కొన్ని నెలల పాటు మామూలు స్థాయిలో ఉండి, ఆ తర్వాత ఏడాది చివరి నాటికి కనిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ కరోనా ఆనవాళ్లు కనబడే ఛాన్సు లేదని క్లూజ్ తెలిపారు.
అమెరికా టాప్ సైంటిస్టు ఆంథోనీ ఫౌసీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నట్లు ఆయన ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆఫ్రికాలో కూడా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త తెలిపారు. అయితే ఎండమిక్ దశకు చేరుకున్నట్లు ఇప్పుడే నిర్ధారించలేమని క్లూజ్ చెప్పారు. ఎండమిక్ దశకు చేరుకుంటే వైరస్ను అంచనా వేయవచ్చు అని, కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు పట్ల జాగ్రత్తగానే ఉండాలని క్లూజ్ అన్నారు. ఒమిక్రాన్ మరీ ఎక్కువగా వ్యాపిస్తే, కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉందన్నారు.