న్యూయార్క్: కోవిడ్ సోకిన వారిలో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఓ కొత్త అధ్యయనం తేల్చింది. పాజిటివ్గా తేలిన వ్యక్తుల అర చేతులు, పాదాల్లో నొప్పి, మంట వస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. జర్నల్ పెయిన్లో దీనికి సంబంధించిన నివేదికను ప్రచురించారు. కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలిన వారిలో నరాల నొప్పి మూడింతలు అధికంగా ఉంటుందని, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, మంట పుట్టడం లాంటి రుగ్మతలు ఉంటాయన్నారు. వైరస్ వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉందని, దాని వల్ల ఫెరిఫెరల్ న్యూరోపథీ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైమన్ హరౌటోనియన్ తెలిపారు. 30 శాతం మంది పేషెంట్లలో నరాల సమస్యలు ఉన్నాయని, కొన్ని కేసుల్లో మూడు నెలల వరకు కూడా ఆ సమస్యలు ఉత్పన్నమైనట్లు ప్రొఫెసర్ సైమన్ చెప్పారు. ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఉండి, ఆ తర్వాత కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తిలో దీర్ఘకాలిక నొప్పులు ఉన్నట్లు గుర్తించారు.