బుదాపెస్ట్: యురోప్ దేశాలు మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులతో సతమతం అవుతున్నాయి. పలు దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హంగేరిలో మళ్లీ భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే టీకాలు ఇచ్చేస్తున్నారు. దీంతో బుదాపెస్ట్లోని ప్రభుత్వ ఆస్పత్రికి భారీ సంఖ్యలో జనం ఎగబడ్డారు.
నిరసనలు..
ఇక కేసులను నియంత్రించే ఉద్దేశంతో ఇవాళ్టి నుంచి ఆస్ట్రియా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తోంది. లాక్డౌన్ విధించవద్దు అంటూ వియన్నాలో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఆ ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి. నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లోనూ నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. ఇంగ్లండ్ కూడా ఓ ఆఫర్ ప్రకటించింది. 40 ఏళ్ల వయసు దాటిన వారికి కోవిడ్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
బెల్జియంలోని బ్రసెల్స్లో మళ్లీ ఉద్రికత్తలు తారా స్థాయికి చేరాయి. పోలీసులపై రాళ్లు రువ్వే ఘటనలు చోటుచేసుకున్నాయి. కఠిన కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిని కేఫ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ వేదికలకు రానివ్వడం లేదు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నెదర్లాండ్స్లోని గ్రోనింజన్ నగరంలో కొందరు ఆస్తులను ధ్వంసం చేశారు.
జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఈ శీతాకాలం పూర్తి అయ్యే లోపు.. జర్మన్ దేశస్థులు వ్యాక్సినేట్ అవుతారని, లేదా కోవిడ్ నుంచి కోలుకుంటారని లేదా చనిపోతారని అయన అన్నారు. డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. అందుకే అర్జెంట్గా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు.