వాషింగ్టన్: కరోనా వైరస్ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచే రెండేళ్ల కిందట కరోనా వైరస్ లీక్ అయ్యిందని తన తాజా పుస్తకం ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’లో పేర్కొన్నారు. చైనా ల్యాబ్లో అధ్యయనం చేస్తున్న కరోనా వైరస్లకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని తెలిపారు. ‘ఇది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు మొదటి రోజు నుండి తెలుసు. మనం వారికి (చైనా)కు బయోవెపన్ టెక్నాలజీని అందజేస్తున్నాం’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, సరైన భద్రత లేని ప్రయోగాల ఫలితంగా వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యిందని సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. ‘సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ను నియంత్రించే చర్యలు ఆ విదేశీ ప్రయోగశాలలో లేవు. ఈ నేపథ్యంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్కు దారితీసింది’ అని తన పుస్తకంలో పేర్కొన్నారు.
అమెరికా బయోమెడికల్, ప్రజారోగ్య పరిశోధనకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)తో చైనాలోని వుహాన్ ల్యాబ్కు దశాబ్దానికిపైగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆండ్రూ హఫ్ తెలిపారు. ఎన్ఐహెచ్ ద్వారా అందే నిధులతో గబ్బిలాల్లోని అనేక కరోనా వైరస్లను వుహాన్ ల్యాబ్ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ఆయన పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ బుక్లోని అంశాలు బ్రిటన్కు చెందిన ది సన్లో ప్రచురితమైనట్లు వెల్లడించింది.
మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కొవిడ్-19 చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లుగా పలు వాదనలు వినిపించాయి. అయితే చైనా ప్రభుత్వంతోపాటు వుహాన్ ల్యాబ్ అధికారులు దీనిని ఖండించారు.