Covid-19 Virus | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్ – డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, కొవిడ్ ప్రస్తుతం నియంత్రణలో ఉందని.. వేసవిలో కేసులు పెరిగే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) తెలిపింది.
గ్లోబల్ టైమ్స్ నివేదిక దేశంలో పాజిటివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తుందని.. ప్రమాదం ఇంకా ముగియలేదని చెబుతుందని పేర్కొంది. రాబోయే నెలల్లో ముఖ్యంగా వేసవిలో జన సంచారం, వాతావరణంలో మార్పులతో కొవిడ్ ప్రమాదం మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పింది. నివాచరణ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (China CDC) పరిశోధకుడు చెన్ కావో మాట్లాడుతూ ప్రస్తుతం ఒమిక్రాన్.. జేఎన్.1 వేరియంట్ చైనాతో పాటు చాలా దేశాల్లో కేసులు రికార్డయ్యాయని.. ఇది ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు.
ఇటీవల చైనా, అమెరికా, సింగ్పూర్తో సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఈ వేరియంటే ప్రధాన కారణమని గుర్తించారు. జేఎన్.1 వేరియంట్ సోకిన చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. స్ప్రింగ్ ఫెస్టివల్ 10-17 వరకు కొనసాగనుండగా.. చాలా ప్రాంతాల్లో వేడుకలు జరుగనున్నాయి. ఈ ఫెస్టివల్ను చైనీస్ న్యూ ఇయర్గా పిలుస్తుంటారు.
ఇది చైనీయులకు ముఖ్యమైన పండుగ నేపథ్యంలో భారీగా జనం గుమిగూడే అవకాశం ఉంటుందని.. అజాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. చైనాలో అనేక ప్రమాదాల్లో కొవిడ్ కేసులు నమోదవుతుండగా.. ప్రస్తుతం వైరస్ నియంత్రణలోనే ఉన్నది. బీజింగ్లోని ఓ ఆసుపత్రికి చెందిన అంటువ్యాధుల చీఫ్ ఫిజిషియన్ లీ టోంగ్జెంగ్ మాట్లాడుతూ ఇన్ఫ్లుయెంజా కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కొవిడ్ రోగుల సంఖ్య ఉందన్నారు. వసంతకాలంలో ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కొత్త ఉత్పరివర్తనాల గురించి సమాచారం లేదన్నారు. జేఎన్.1 వేరియంట్ తరహాలో అధికంగా వ్యాపించే లక్షణాలున్న వేరియంట్తో తక్కువ సమయంలోనే చాలా ప్రాంతాల్లో ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా నుంచి రక్షించుకునేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచించారు.