న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉన్నది. ప్రస్తుతం కేసుల తగ్గుముఖం పడుతున్నది. దీంతో యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. అయితే, మహమ్మారి గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 50కోట్ల మార్క్ను దాటింది. తొలి కేసు నమోదైన రోజు నుంచి 877 రోజుల తర్వాత 50 కోట్లకు పెరిగాయి. ఇందులో 44.88కోట్ల మంది కోలుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. మరో ఆందోళనకరమైన విషయమేంటంటే మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 62లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలను వరల్డ్మీటర్.ఇన్ఫో (worldometers.info/coronavirus) విడుదల చేసింది.
కరోనా మహమ్మారి తొలి కేసు చైనాలో వుహాన్ నగరంలో నవంబర్ 17, 2019లో నమోదైంది. ఆ సమయంలో మహమ్మారి ఇంత ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ విషయాన్ని చైనా సైతం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడిందని ఆరోపణలున్నాయి. అయితే, అదే ఏడాది చివరి నాటికి పలు దేశాలకు విషయం తెలిసింది. ఈలోగా వుహాన్ నగరంలో చాలా మంది వైరస్ సోకింది. 01, జనవరి 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైరస్పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ భేటీలో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత జనవరి 4, 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి తెలిపింది. 12 జనవరి 2020న చైనా కరోనా జన్యు క్రమాన్ని బహిరంగంగా వెల్లడించింది. ఆ మరుసటి రోజే చైనా వెలుపల థాయ్లాండ్లో తొలి కొవిడ్ కేసు నమోదైంది. జనవరి 14, 2020న కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, లక్షణాలు, సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాచారం ఇచ్చింది. 30 జనవరి, 2020న భారత్లోని కేరళలో కరోనా తొలి కేసు రికార్డయ్యింది. అదే రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.ఆ తర్వాత 11 మార్చి 2020న డబ్ల్యూహెచ్ కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది.
2020, నవంబర్ 14న చైనాలో కరోనా తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత 222 రోజులకు అంటే.. 25 జూన్ 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సోకిన వారి సంఖ్య 10 మిలియన్లకు చేరింది. ఆ తర్వాత 190 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రోగుల సంఖ్య 200 మిలియన్లకు చేరింది. అంటే 20-30 కోట్ల మందికి మహమ్మారి 155 రోజుల్లోనే సోకింది. ఆ తర్వాత మహమ్మారి వినాశనం సృష్టించింది. కేవలం 34 రోజుల్లోనే 100 మిలియన్ల కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ఈ సంఖ్య 40 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఈ 40కోట్ల మార్క్.. 62 రోజుల్లోనే 50 కోట్లకు చేరింది.
మహమ్మారి ముఖ్యంగా అమెరికాలో విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు 8.20కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. అయిదే ఇందులో 7.99కోట్ల మంది కోలుకోవడం ఊరటనిచ్చే విషయం కాగా.. 10లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి భారత్పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొవిడ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఇప్పటి వరకు 4.30లక్షల మందికి వైరస్ సోకగా.. ఇందులో 4.25 మంది కోలుకోగా.. 5.21లక్షల మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో 11వేల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజుకు 6-10లక్షల మంది మహమ్మారి బారినపడుతున్నారు. 1500-3వేల మంది ప్రాణాలు కోల్పోతుండగా.. 6-7లక్షల మంది వైరస్ నుంచి కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. చాలా దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలుకావడం ఆందోళన కలిగించే విషయం. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రియా తదితర దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైనట్లుగా అంచనా వేస్తున్నారు. గత రోజుల గణాంకాలను పరిశీలిస్తే.. దక్షిణ కొరియాలో అత్యధికంగా 14 లక్షల కేసులు గుర్తించారు. ఇక్కడ 2100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు రోజుల్లో జర్మరీలో పది లక్షల మందికి, ఫ్రాన్స్లో 9లక్షల మందికి వైరస్ సోకింది.