ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన సమస్యలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధనకులు చేసిన అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదడు సైజు తగ్గుతోందట. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా కూడా ఇది జరుగుతోందని వారు చెప్పారు.
అయితే కరోనా తగ్గిన తర్వాత మళ్లీ మెదడులో కొంత భాగమైనా సాధారణ స్థాయికి చేరుతుందా? అనే విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కరోనా వల్ల మెదడు సంబంధ సమస్యలు వస్తాయనడానికి బలమైన ఆధారాలు లభించాయని ఒక పరిశోధకుడు తెలిపారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వాళ్లలో కూడా కాన్సన్ట్రేషన్, పనులు చేయడానికి అవసరమైన మెదడు భాగాలు దెబ్బతిన్నట్లు వివరించారు.
కరోనా సోకిన వారిలో 0.2 నుంచి 2 శాతం వరకు మెదడు పరిమాణం తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్లో ఆల్ఫా వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో ఈ పరిశోధన జరిగిందని సమాచారం. అయితే అధ్యయనంలో పాల్గొన్న పేషెంట్లలో డెల్టా వేరియంట్ సోకిన వారు లేనట్లు తెలుస్తోంది.