న్యూఢిల్లీ : పదిహేనేండ్లుగా వేరుగా ఉంటున్న భార్య సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో రూ 2.9 కోట్ల రుణాలను పొంది ఎగవేతకు పాల్పడిన డాక్టర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని వైశాలికి చెందిన డాక్టర్ సుధాకర్ ఆర్య భార్యను మోసగించి డీహెచ్ఎఫ్ఎల్ నుంచి భారీ రుణం తీసుకున్నాడు. తమ కుమార్తె ఎడ్యుకేషన్ లోన్ కోసం సుధాకర్ భార్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ను ఆశ్రయించగా ఈ విషయం బయటపడింది. ఇప్పటికే ఆమె రూ 2.90 కోట్ల రుణం తీసుకుని డిఫాల్టర్గా ఉన్నందున లోన్ అప్లికేషన్ను తిరస్కరిస్తున్నట్టు బ్యాంక్ తెలపగా ఆమె షాక్కు గురయ్యారు.
దీంతో సిబిల్ రిపోర్టును చెక్ చేసుకోగా తన భర్త డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రూ 1.3 కోట్లు, రూ 1.8 కోట్లు చొప్పున తాను సహ దరఖాస్తుదారుగా రెండు రుణాలు తీసుకున్నట్టు వెల్లడైంది. రుణం పొందేందుకు తన సంతకం, పాన్ కార్డు, ఓటర్ కార్డులను సైతం డాక్టర్ సుధాకర్ ఫోర్జరీ చేసినట్టు ఆమె గుర్తించారు. భర్తపై ఢిల్లీ హైకోర్టు, మధ్యవర్తిత్వ కేంద్రంలో కేసు దాఖలు చేయగా ఆయన ఎన్నడూ మధ్యవర్తిత్వ కేంద్రానికి హాజరు కాలేదు. ఆపై భర్తపై ఢిల్లీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. రుణ దరఖాస్తులపై సంతకాలతో పాటు ఫిర్యాదుదారు పాన్ కార్డు, ఓటరు కార్డులనూ నిందితుడు ఫోర్జరీ చేశాడని ఫోరెన్సిక్ నివేదిక సాయంతో పోలీసులు నిగ్గుతేల్చారు. దర్యాప్తు అనంతరం నిందితుడు డాక్టర్ సుధాకర్ను అరెస్ట్ చేశారు.