పారిస్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్తి కూడా నెమ్మదించింది. దీంతో దేశాలు ఒక్కోక్కటిగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. తాజాగా విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఫ్రాన్స్ (France) సడలించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా నెటెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది శనివారం నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఏ దేశం నుంచైనా ఫ్రాన్స్ వచ్చేవారు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది. గ్రీన్ లిస్ట్లోని దేశాల నుంచి వచ్చేవారు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోనట్లయితే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వారు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
కాగా, ఆరెంజ్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారు మాత్రం ఫ్రాన్స్కు ఎందుకు వస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదేవింధంగా ప్రయాణానికి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తప్పనిసరిగా నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు పెరగడంతో గత డిసెంబర్లో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది.