న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. చైనాలో పరిస్థితి భయానకంగా ఉన్నది. షాంఘై నగరంలో ప్రమాదకరంగా మారింది. కరోనా కారణంగా చైనా పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 13,143 కొత్త కేసులు రికార్డయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం మొదటి వేవ్ తర్వాత ఇదే అత్యధికం, షాంఘై నగరంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 8,226 కేసులు నమోదయ్యాయి.
దేశంలోని చాలా ప్రావిన్సుల్లో ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరింది. బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో నగరంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. విదేశాలకు సైతం ఎగుమతులు నిలిచిపోయాయి. భారీగా పెరిగిన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం దవాఖానాల్లో రోగులను చేర్చుకునేందుకు బెడ్లు కరువయ్యాయి. పరిస్థితులు దారుణంగా మారినా.. ఇప్పటి వరకు కరోనాతో ఎవరూ మరణించలేదని చైనా పేర్కొంది.
యూకేలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్యతో పాటు మరణాల రేటు మళ్లీ పెరుగుతున్నది. మార్చి 19-26 వరకు దాదాపు 50లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల వ్యాప్తికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 వేరియంట్ కారణంగా భావిస్తున్నారు.
దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 2,64,171 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 306 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రోగులకు చేర్చుకునేందుకు ఆసుపతుల్లో బెడ్లు ఖాళీలు లేవు. ఇప్పటికే చాలా నగరాల్లో లాక్డౌన్ను విధించారు.
అమెరికాలో జనాభా గణన తర్వాత.. దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్లలో, కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అమెరికాలోని 73 శాతం కౌంటీల్లో జనాభా తగ్గిందని తేలింది. 2019లో ఈ కౌంటీల్లో మరణాల సంఖ్య 45.5శాతం కాగా.. 2020లో దాదాపు 10 శాతానికి పెరిగింది. 2020లో 55.5 శాతం మరణాలు రికార్డయ్యాయి.
భారత్లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులున్నాయి. గత 24గంటల్లో 1,096 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 81 మంది మరణించగా.. 1,447 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. 13,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 4,24,93,773 కేసులు రికార్డయ్యాయి.