న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ఫర్నిచర్ మార్కెట్లో శనివారం అర్ధరాతి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 32 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అలాగే మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీసెస్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ రాజేశ్ శుక్లా మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు మంటలు చెలరేగాయని సమాచారం వచ్చిందని తెలిపారు.
ఈ మేరకు వెంటనే 32 ఫైర్ టెండర్లను తరలించినట్లు చెప్పారు. ఆదివారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎనిమిది మందిని రక్షించినట్లు వివరించారు. ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించగా.. అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. అయితే, అగ్ని ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.