‘ఒమిక్రాన్’ వేరియంట్ వెలుగు చూడటంతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ను తొలిగా గుర్తించింది కూడా ఈ దేశపు సైంటిస్టులే అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో కరోనా నాలుగో వేవ్ మొదలైంది.
దీనిపై సౌతాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ వాసిలా జస్సాత్ మాట్లాడారు. నాలుగో వేవ్ ప్రారంభంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆమె హెచ్చరించారు.
అన్ని వయసుల వారిలో ఈ కేసులు పెరుగుతున్నాయని, మరీ ముఖ్యంగా ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారుల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని వారాలపాటు ఈ ఏజ్గ్రూప్ చిన్నారులను పర్యవేక్షణలో ఉంచడం ద్వారా ప్రస్తుత పరిస్థితిపై మరింత స్పష్టత వస్తుందని ఎన్ఐసీడీకే చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్ మిచెల్లె గ్రూమ్ తెలిపారు.