వాషింగ్టన్, జూన్ 2: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల్తో తమ పార్టీ పొత్తును ఈ సందర్భంగా సమర్థించారు. రానున్న మూడు-నాలుగు రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తమ పార్టీ ఓడిస్తుందని చెప్పారు. భారత్లో 60 శాతం ప్రజలు బీజేపీకి, నరేంద్ర మోదీకి ఓటేయరన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ప్రతిపక్షాల ఐక్యత కోసం విపక్షాలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు ఫలిస్తాయనే నమ్మకం తనకు ఉందని రాహుల్ తెలిపారు. నరేంద్ర మోదీని ఓడించడం కష్టమని భారత మీడియా రాయడాన్ని రాహుల్ అతిశయోక్తిగా అభివర్ణించారు. వాస్తవానికి మోదీ చాలా బలహీనంగా ఉన్నారని తెలిపారు. భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నియంత్రణ కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నాయని, ఇవి ప్రజలను ఎక్కువగా బాధిస్తాయన్నారు.