బునియా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వల్ల మృతిచెందిన వారిన సంఖ్య 101కి చేరుకున్నది. ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అయితే అక్కడ ఉన్న సాయుధ గ్రూపుల వల్ల వైరస్ నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. తాజాగా ప్రభుత్వం కొత్త నివేదికను రిలీజ్ చేసింది. 550 పాజిటివ్ కేసుల్లో మృతుల సంఖ్య వందకు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 10 మంది మృతిచెందగా, 35 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం చెప్పింది. ఎబోలాలోని బుందిబుగ్యో స్ట్రెయిన్ మహమ్మారిలా మారినట్లు మే 15వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది.
ఆరంభంలో ఎబోలా కేసులను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు పరిస్థితిన అదుపులోకి తేవడం కష్టంగా మారింది. ఇటురి, నార్త్ కివు, సౌత్ కివు ప్రావిన్సుల్లో ఎక్కువగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే జుగు, ఇరుము, మాంబసా ప్రాంతాల్లో సాయుధ గ్రూపులు ఉండడం వల్ల అక్కడ వైరస్ను అదుపు చేయడం అసాధ్యమవుతోంది. మూడు కీలకమైన ప్రావిన్సుల్లో సుమారు 120 సాయుధ దళాలు ఉన్నాయని, వర్గ పోరు, రాజకీయ ప్రత్యర్థులు, అవినీతి వల్ల అక్కడ హింస పెరుగోతంది. దీంతో ఎబోలా కేసులను గుర్తించి, నియంత్రించడం పెను సవాల్గా మారింది.
కాంగోలో సుమారు 10 కోట్ల జనాభా ఉంటుంది. అక్యడ ఈ వైరస్ వ్యాపించడం ఇది 17వ సారి. 1976లో తొలిసారి ఎబోలా వైరస్ను గుర్తించారు. ప్రస్తుతం బుందిబుగయో స్ట్రెయిన్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. పొరుగు దేశం ఉగాండా నుంచి ఆ వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి జరిగినట్లు భావిస్తున్నారు.