బీజింగ్: భారత్పై చైనా మరోసారి ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తున్న సహాయ సహకారాలను మెచ్చుకున్నది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ చేస్తున్న సహాయ ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. ‘శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం చాలా చేసిందని మేం గమనించాం. ఆ ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారతదేశం, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది’ అని లిజియన్ అన్నారు. చైనా ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని, శ్రీలంక సమాజానికి సహాయం అందించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తుందని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గోటాభయ రాజపక్సే చేసిన వ్యాఖ్యకు సంబంధించిన ఒక ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.
కాగా, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే జూన్ 6న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా నుంచి 1.5 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ను శ్రీలంక పొందలేకపోయిందని తెలిపారు. అలాగే 1 బిలియన్ డాలర్ల రుణం కోసం చైనాకు చేసిన అభ్యర్థనను ఆ దేశం పట్టించుకోలేదని అన్నారు. చైనా తన వ్యూహాత్మక దృష్టిని ఆగ్నేయాసియా, ఆఫ్రికా వైపు మళ్లించినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే దక్షిణాసియాపై తక్కువ ఆసక్తిని చూపుతున్నదని అన్నారు.
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే చేసిన ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందించారు. శ్రీలంక ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లను బీజింగ్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ‘మా సామర్థ్యం మేరకు శ్రీలంక సామాజిక ఆర్థిక అభివృద్ధికి మద్దతిచ్చాం. శ్రీలంక కోసం 500 మిలియన్ విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని చైనా ప్రకటించింది’ అని వెల్లడించారు.