గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు. విపత్తు నుంచి బయటపడ్డా చలి వల్ల చనిపోతామని ఆందోళన చెందుతున్నారు. తమని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. మరోవైపు శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే భూకంప మృతుల సంఖ్య 19,300 దాటింది. ఇక సిరియాలో అంతర్యుద్ధం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నది. భూకంపం దాటికి ధ్వంసమైన రోడ్లు, రన్వేల వల్ల కూడా ప్రజలకు వేగంగా సహాయం అందడం లేదు.
తమ వారిని కాపాడుకునేందుకు..
భూకంపంతో కూలిన భవనాల శిథిలాల కింద ఉన్న వారిని తొలగించేందుకు రెస్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు తుర్కియే అధికారులు చెప్తున్నారు. అయితే, తమ వారిని కాపాడుకునేందుకు ప్రజలు కూడా బృందాలుగా ఏర్పడి శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమని కాపాడాలని చేస్తున్న ఆక్రందనలు విని భరించలేకపోతున్న ప్రజలు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
సిరియాకు అందని సాయం
భూకంపం సంభవించిన వాయువ్య సిరియా ప్రాంతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండటం, ఇక్కడ భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుండటంతో వేగంగా సహాయక చర్యలు అందడం లేదు. తుర్కియే నుంచి ఈ ప్రాంతానికి సరుకులు తీసుకెళ్లేందుకు ఒకే మార్గం ఉంది. అది కూడా భూకంపం ధాటికి ధ్వంసమైంది. పలు సేవా సంస్థలు సరుకులు పంపిస్తున్నా వాటిని సిరియాకు పంపించే అధికారం కేవలం ఐరాసకు మాత్రమే ఉంది. అన్ని అడ్డంకులు దాటుకొని ఎట్టకేలకు సరుకులతో కూడిన మొదటి ఐరాస ట్రక్కు గురువారం సిరియాకు చేరుకున్నది.
భూకంపం దెబ్బకు దేశమే జరిగింది
రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపానికి తుర్కియే దేశమే కదిలిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సిరియాతో పోల్చితే తుర్కియే ఐదారు మీటర్ల మేర కదిలిపోయిందని పేర్కొన్నారు. తుర్కియే ఉన్న భూమి పైపొరల్లోని పలకల రాపిడి కారణంగా ఇది జరిగిందని అంచనా వేస్తున్నారు.