France riots | ప్యారిస్: మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కాల్చిచంపటంతో ఫ్రాన్స్లో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. 1300 పైచిలుకు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా, నిరసనలు ఆగటం లేదు. నిరసనకారులంతా టీనేజర్లేనని పోలీసులు చెప్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
జాతి వివక్షపై పోరేనా?
ఫ్రాన్స్లో తాజా అల్లర్లు గత ఏడాది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ను పోలీసులు చంపిన తర్వాత చెలరేగిన అల్లర్లను తలపిస్తున్నాయి. పోలీసులు నడిరోడ్డుపై మెడపై మోకాలుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేయటంతో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరాడటం లేదని అతడు మొత్తుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. ఇప్పుడు ఫ్రాన్స్లో చనిపోయిన నాహెల్ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన అరబ్ మూలాలున్న నల్లజాతీయుడే. అతడు ముస్లిం మతానికి చెందినవాడు. దీంతో ఫ్రాన్స్లోని నల్లజాతీయులంతా తీవ్ర ఆగ్రహంతో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు దశాబ్దాలుగా పాతుకుపోయిన జాతి వివక్షపై తిరుగుబాటు అని ప్రచారం అవుతున్నది. సోషల్మీడియాలో కూడా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ హోరు కొనసాగుతున్నది. నాహెల్ తల్లి కూడా తన కుమారుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు.