ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు (Chinese engineers’ convoy attacked). ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. చైనా నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ల కాన్వాయ్ను గ్వాదర్లోని ఫకీర్ వంతెనపై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు అడ్డుకుని దాడి చేశారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పాకిస్థాన్ భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ రహదారిని బ్లాక్ చేశాయి. పరస్పర కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. పాకిస్థాన్ భద్రతా సిబ్బంది కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.
మరోవైపు చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై దాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. గతంలో కూడా చైనా జాతీయుల లక్ష్యంగా పలు దాడులకు పాల్పడింది. కాగా, తాజా సంఘటన నేపథ్యంలో బలూచిస్థాన్లోని తమ పౌరులు ఇండ్లలోనే ఉండాలని చైనా సూచించింది.