బీజింగ్: ఒక జంట కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. ప్రియుడి పిల్లల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 15వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు విసిరేసి హత్య చేశారు. ప్రమాదవశాత్తు పడిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆ జంటకు కోర్టు మరణ శిక్ష విధించడంతో బుధవారం దానిని అమలు చేశారు. (Chinese Couple Executed) చైనాలోని చాంగ్కింగ్లో ఈ సంఘటన జరిగింది. జాంగ్ బో, యే చెంగ్చెన్కు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. వివాహితుడైన జాంగ్ బో తన భార్య చెన్ మెయిలిన్కు విడాకులు ఇచ్చాడు. అయితే పిల్లలైన రెండేళ్ల పాప, ఏడాది బాబు అతడి వద్ద ఉన్నారు.
కాగా, జాంగ్ బో ప్రియురాలు యే చెంగ్చెన్ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే పిల్లలు దగ్గర ఉంటే అతడితో కలిసి ఉండబోనని ప్రియురాలు చెప్పింది. దీంతో పసి పిల్లల అడ్డు తొలగించేందుకు వారిద్దరూ సోషల్ మీడియాలో ముఖాముఖిగా చర్చించారు. ఎలాంటి అనుమానం రాకుండా చిన్నారులను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు.
2020 ఫిబ్రవరిలో ఎత్తైన అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 15వ అంతస్తు నుంచి తన ఇద్దరు పిల్లలను జాంగ్ బో కిందకు విసిరేసి చంపాడు. తాను నిద్రిస్తుండగా పిల్లలు అపార్ట్మెంట్ కిటికీ నుంచి కింద పడి మరణించినట్లు పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియురాలు యే బలవంతం వల్ల జాంగ్ తన ఇద్దరు పిల్లలను అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి కిందకు విసిరేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ విషయం తెలిసిన జాంగ్ మాజీ భార్య చెన్ తల్లడిల్లిపోయింది. తనకు పరిహారం ఇప్పించాలని, తన పిల్లలను దారుణంగా చంపిన మాజీ భర్త, అతడి లవర్ను కఠినంగా శిక్షించాలని కోర్టును ఆమె అభ్యర్థించింది. దీంతో 2021 డిసెంబర్ 28న చాంగ్కింగ్ కోర్టు ఆ జంటకు మరణ శిక్ష విధించింది.
మరోవైపు జాంగ్ బో, అతడి ప్రియురాలు పీపుల్స్ సుప్రీంకోర్టులో అపీల్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పసి పిల్లలను దారుణంగా హత్య చేసిన ఆ జంటకు కింది కోర్టు విధించిన మరణ శిక్షను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరికీ విష ఇంజక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేశారు. ఈ వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.