ఉక్రెయిన్లోని చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేంతగా పరిస్థితులు లేవని, కాస్త సంయమనంతోనే ఉండాలని ఉక్రెయిన్లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. రష్యా దాడి ముగిసిన తర్వాతే వారిని చైనాకు తరలిస్తామని రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ పేర్కొన్నారు. తాను ఉక్రెయిన్ రాజధాని కివీని విడిచి ఎక్కడికీ వెళ్లలేదని, కివీలోనే ఉన్నానన్నారు. ఈ విషయంలో లేని పోని పుకార్లు వస్తున్నాయని పేర్కొన్నారు.
అతి సురక్షితంగా చైనాకు చేరుకోవడమే తమ ముందున్న లక్ష్యమని, రష్యా దాడి ముగిసేంత వరకూ వేచిచూడాల్సిందేనన్నారు. అందరూ సురక్షితంగా ఉండేవిధంగా, సౌకర్యాలు అందరికీ అందేవిధంగా సౌకర్యాలు చేశామని, చైనా పౌరులెవ్వరూ భయపడొద్దని ఆయన భరోసా కల్పించారు. కొన్ని రోజులుగా బాంబు పేలుళ్లు, బాంబుల మోత, బేస్మెంట్లలో దాక్కుంటున్నామని, ఇలాంటి సీన్స్ కేవలం సినిమాల్లోనే చూశామని, ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ పేర్కొన్నారు.
స్థానికులతో గొడవలొద్దు : చైనా రాయబారి
ఉక్రెయిన్లోని చైనీయులకు చైనా రాయబారి మరో కీలక సూచన కూడా చేశారు. ఉక్రెయిన్లోని స్థానికులతో ఎవ్వరూ వాదాలకు గానీ, గొడవలకు గానీ దిగొద్దని ఉక్రెయిన్లోని చైనా రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ సూచించారు. వారి పరిస్థితులను, వారి మనోభావాలను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం వారు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, చాలా ఇబ్బందులు పడుతున్నారని చైనా రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ అన్నారు.