హైదరాబాద్ : రాష్ట్రంలో చెడగొట్టు వానలు కురుస్తున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గ్రేటర్ హైదరాబాద్తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 24.8 మిల్లీమీటర్ల వాన పడింది.
మరోవైపు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి.. విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు దాకా విస్తరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.