బీజింగ్ : తైవాన్ తమ భూభాగమని అవసరమైతే బలవంతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా స్పష్టం చేసింది. తైవాన్ రాజకీయ నేతలు, స్వాతంత్య్రాన్ని కాంక్షించే వారిని శిక్షిస్తామని శుక్రవారం తెలిపింది. బీజింగ్, తైపీల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
తైవాన్ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేసేందుకు గత కొన్నేండ్లుగా చైనా ప్రయత్నిస్తోంది. మరోవైపు తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిపై చట్టాలకు అనుగుణంగా చైనా చర్యలు చేపడుతుందని బీజింగ్లోని తైవాన్ వ్యవహారాల కార్యాలయం హెచ్చరించింది.
తైవాన్ ప్రధాని సు సెంగ్-చాంగ్, పార్లమెంట్ స్పీకర్ యూషి కున్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ తదితరులు స్వతంత్ర ఉద్యమకారులకు మద్దతిస్తున్నారని తైవాన్ వ్యవహారాల కార్యాలయం ప్రతినిధి ఝౌ ఫెంగ్లియన్ అన్నారు. తైవాన్ రాజకీయ నేతలు చైనాతో ఘర్షణలకు కాలుదువ్వుతూ బీజింగ్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.