న్యూయార్క్, డిసెంబర్ 6: చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది. చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ కదలికలపై భారత నేవీ ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.
చైనా నౌక చివరిసారిగా ఇండోనేషియాలోని సుండా జలసంధిలో కనిపించింది. హిందూ మహా సముద్రంలో చైనా గూఢచార నౌక కనిపించిన నేపథ్యంలో భారత్ క్షిపణి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్తోట నౌకాశ్రయంలో చైనా గూఢచార నౌకను డాకింగ్ చేయడంతో భారత్, శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదం ఏర్పడింది.