బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించింది. ఇక తైవాన్ ద్వీపానికి పంపనున్న ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికాలో హై ప్రొఫైల్ పదవిలో ఉన్న పెలోసీ తైవాన్లో పర్యటించడం వల్ల చైనాతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. సిట్రస్ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని సస్పెండ్ చేస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ తెలిపింది. పండ్లు, చేపల్లో క్రిమిసంహారకాలు ఎక్కువ శాతం ఉంటున్నాయని, కొన్ని ప్యాకెట్లలో కరోనా టెస్టు పాజిటివ్ వస్తుందని కస్టమ్స్ శాఖ తెలిపింది. సహజమైన ఇసుకను తైవాన్కు ఎగుమతి చేసే అంశంపై నిషేధం విధిస్తున్నట్లు చైనా వాణిజ్య శాఖ నోటీసు ఇచ్చింది.