వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకే వారు పరిష్కారం కోసం ‘ఏర్పాట్లు’ చేసుకుంటున్నారని తనకు తెలుసునని చెప్పారు. ‘తాలిబన్లతో అసలు సమస్య చైనాకే ఉంది. అందువల్ల దానిని పరిష్కరించుకునేందుకు తాలిబన్లతో ఏవో ‘ఏర్పాట్లు’ చేసుకుంటున్నారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ లానే.. చైనా కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడేం చేయాలని వాళ్లంతా ఆలోచించుకుంటున్నారు’ అని బైడెన్ అన్నారు. చైనా నుంచి తాలిబన్లు నిధులు పొందుతున్నారనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి జీ-7 దేశాలు సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే ప్రకటించాయి. అయితే తాలిబన్లకు ఆర్థిక సాయాన్ని అమెరికా ఇప్పటికే నిలిపివేసింది. అయితే చైనా, రష్యా లేదా ఇతర దేశాలు తాలిబన్లకు నిధులు సమకూర్చినట్లయితే వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. చైనా ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లతో సంప్రదింపులు ప్రారంభించింది. తాలిబన్ల పాలన చట్టబద్ధమేనని గుర్తించేందుకు సిద్ధంగా ఉందని అమెరికాలోని ఓ వార్తా సంస్థ పేర్కొన్నది.