బీజింగ్: కరోనా వైరస్ నియంత్రణకు చైనా ముమ్మరంగా పోరాడుతోంది. ఆ దేశ జనాభాలో వంద కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. అంటే దేశ జనాభాలో 71 శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు. ఆ దేశ అధికార గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి.. 2.16 బిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు జాతీయ హెల్త్ కమిషన్ ప్రతినిధి మీ ఫెంగ్ తెలిపారు. 89 కోట్ల మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగినట్లు గత నెలలో చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిలోగా దేశ జనాభాలో 80 శాతం మందికి వ్యాక్సిన్ ఇస్తామని ఇటీవల ప్రముఖ వైరాలజిస్ట్ జాంగ్ షాన్షాన్ తెలిపారు. దాంతో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోంది. ఈశాన్య ప్రావిన్సులోని ఫూజియాన్లో డెల్టా కేసులు ఎక్కువయ్యాయి. అక్కడ స్కూల్ విద్యార్థుల్లో కేసులు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. సింగపూర్ నుంచి పుటియన్ నగరానికి చెందిన ఓ వ్యక్తిలో తొలుత డెల్టా కేసును గుర్తించారు. అయితే ఆ వ్యక్తికి చెందిన 12 ఏళ్ల కొడుకుతో పాటు ఆ పిల్లవాడి క్లాస్మేట్లో వైరస్ను తొలుత గుర్తించారు. ఆ ఇద్దరు పిల్లల నుంచి ఓ క్లాస్రూమ్లో ఉన్న 36 మంది చిన్నారులకు వైరస్ సోకినట్లు తేల్చారు. కరోనా మహమ్మారి స్టార్ట్ అయిన తర్వాత తొలిసారి స్కూల్ విద్యార్థుల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
12 నుంచి 17 ఏళ్ల మైనర్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చైనా నిర్ణయించినా.. ఆ ఏజ్ గ్రూపులో ఉన్నవారికి వ్యాక్సినేషన్ వేగంగా జరగడం లేదు. దీంతో భయాందోళనలు మొదలయ్యాయి. చైనాలో తయారైన వ్యాక్సిన్లలో 60 శాతం సామర్థ్యం ఉన్నట్లు తెలిసిందే. అయితే బూస్టర్ డోసుతో వారిలో యాంటీబాడీలు పెరుగుతున్నట్లు గుర్తించారు.