బీజింగ్: చైనాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 21 ప్రావిన్స్లను డెల్టా వేరియంట్ ప్రభావితం చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య 1,308 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వేసవిలో డెల్టా వ్యాప్తి సందర్భంగా నమోదైన 1,280 కేసులను ఈ సంఖ్య అధిగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన జీరో-టాలరెన్స్ గైడెన్స్ మేరకు కరోనా వ్యాప్తిని నియంత్రించడంపై ఆ దేశ ఆరోగ్య అధికారులు దృష్టిసారించారు. కాంటాక్ట్ ట్రేసింగ్తోపాటు కరోనా పరీక్షలను వేగవంతం చేశారు. వినోద, సాంస్కృతిక వేదికలను మూసివేశారు. పర్యాటకులు, ప్రజా రవాణాపై ఆంక్షలు విధించారు.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఈశాన్య నగరం డాలియన్లో లాక్డౌన్ విధించారు. అక్కడి వ్యక్తులు ఇతర నగరాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. దండోంగ్, అన్షాన్, షెన్యాంగ్తో సహా డాలియన్ సమీపంలోని కొన్ని నగరాలకు డాలియన్ నుండి వచ్చే వ్యక్తులు 14 రోజులు క్వారంటైన్ కేంద్రాల వద్ద ఉండాలని ఆదేశించారు.
కాగా, ఈ నెల 14 నాటికి చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,315కు, మరణాల సంఖ్య 4,636కు చేరింది.