న్యూయార్క్: పాకిస్థాన్లోని లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. 2008 ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అతను. ఇటీవల గడిచిన నాలుగు నెలల్లోనే భారత్, అమెరికా చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం ఇది మూడవ సారి. యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్లోని ఆల్ఖయిదా సాంక్షన్స్ కమిటీ 1267 ప్రకారం సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని అమెరికాతో పాటు భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని ఆస్తులను సీజ్ చేయాలని, ట్రావెల్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు.
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సాజిద్ మీర్. అతనిపై 50 లక్షల డాలర్ల నజరానా ఉంది. ఈ ఏడాది జూన్లో పాక్లోని యాంటీ టెర్రరిజం కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. సాజిద్ మీర్ చనిపోయినట్లు పాక్ చెబుతున్నా.. పశ్చిమ దేశాలు మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు. లష్కరే సంస్థలో మీర్ సీనియర్ సభ్యుడు.