న్యూయార్క్, ఆగస్టు 6: గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సలసలా కాగుతున్నది. కర్బన్ ఉద్గారాల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దీని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న మానవుడు రానున్న రోజుల్లో అంతరించే దశకు చేరుకుంటాడు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. సోలార్ షీల్డ్ను ప్రయోగించి ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే ప్రయోగాలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. స్పేస్ బేస్డ్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ షీల్డ్ (ఎస్ఆర్ఎం) ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి భూమిని కాపాడేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హవాయి సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది.
సోలార్ షీల్డ్తో సూర్యరశ్మికి చెక్ పెట్టవచ్చని ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఖగోళ శాస్త్రవేత్త ఇస్తావన్ స్జాపుడి పరిష్కార మార్గాన్ని సూచించారు. భూమికి సూర్యుడికి మధ్య భారీ ఉల్కను గొడుగులా వాడి సూర్యరశ్మి నేరుగా భూమిపై పడకుండా నిరోధించవచ్చని ఆయన వెల్లడించారు. అధ్యయన ఫలితాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్)లో ప్రచురించారు. ఆస్టరాయిడ్లు అంతరిక్షంలోనే ఉన్నప్పటికీ సోలార్ షీల్డ్ కోసం భారీ పదార్థాలను అక్కడికి చేర్చడం సవాలుతో కూడుకున్నదే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం 50 టన్నుల బరువులను తక్కువ ఎత్తు ఉండే అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టే రాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండటం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది.