కొలంబో, మే 10: ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. కొలంబోలో ఆర్మీ ఉన్నప్పటికీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మహింద రాజపక్స మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడులకు తెగబడటంతో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
దాదాపు 250 మందికి గాయాలయ్యాయి. సోమవారం నిరసనకారులు గొటబయ, మహింద రాజపక్సల పూర్వీకుల ఇంటితో పాటు పలువురు ఎంపీల ఇండ్లకు నిప్పు పెట్టారు. మొత్తంగా 38 ఇండ్లు కాలిపోయినట్టు, అనేక వాహనాలు బుగ్గి అయినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో శ్రీలంకలో కొంత మంది ప్రజాధనాన్ని దోచుకెళ్తున్నారు. దుకాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ఇతరులకు హాని కలిగించినా వారిని కాల్చిపారేయాలని ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నౌకాదళ సిబ్బందిని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నిరసనకారులు కొలంబోలోని బండారునాయకే ఎయిర్పోర్టుకు వెళ్లే దారిపై చెక్పోస్టును ఏర్పాటు చేశారు. మహింద రాజపక్స మద్దతుదారులు దేశం విడిచి పారిపోకుండా ఈ చర్యకు పూనుకొన్నారు.
సంయమనం పాటించండి: గొటబయ
ప్రజలు హింసను విడనాడాలని, సంయమనం పాటించాలని అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజలను కోరారు. దేశంలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక సంక్షోభం పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకొంటామన్నారు. మహింద రాజీనామాతో మొత్తం మంత్రి మండలి రద్దు కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గొటబయ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటును వెంటనే సమావేశపర్చాలని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ అధ్యక్షుడు గొటబయను కోరారు.
మహింద అరెస్టుకు డిమాండ్
ప్రధాని పదవి నుంచి దిగిపోయినప్పటికీ మహింద రాజపక్సకు నిరసన సెగ తప్పట్లేదు. ప్రజాందోళనలకు జడిసి ఆయన రాజధాని కొలంబో నుంచి పారిపోయారు. ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరంలో కుటుంబంతో సహా తలదాచుకొన్నారు. మంగళవారం ఉదయం ఆయనను భద్రతా సిబ్బంది ట్రింకోమలికి తరలించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు సోమవారం రాత్రంతా మహింద అధికార నివాసం టెంపుల్ ట్రీస్ దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. కొంత మంది భవనంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది మహిందను నౌకాదళ స్థావరానికి తరలించారు. అయితే, మహింద ట్రింకోమలి నౌకాదళ స్థావరంలో ఉన్నారని తెలిసి ప్రజలు అక్కడ కూడా ఆందోళనలు చేపట్టారు. మహింద కుమారుడు నమల్ కుటుంబం కొలంబో వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్టు మీడియా కథనాల సమాచారం. మరోవైపు, మహిందను అరెస్టు చేయాలని, సోమవారం చెలరేగిన హింసకు ఆయనే కారణమని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.