న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఆగస్ట్ 31 వరకు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ అప్పుడే ఆత్మసంతృప్తి చెందవద్దని సూచించింది.
కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వరుస పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
కోవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని సూచించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖలు పంపారు.