లండన్, మార్చి 25: చక్కెరతో అధిక క్యాలరీలు ఒంట్లోకి చేరిపోతాయి. దీంతో చాలా మంది బరువు తగ్గేందుకు తక్కువ క్యాలరీలు ఉండే కృత్రిమ చక్కెరలను వాడుతుంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ షుగర్తో మంచి కంటే చెడే ఎక్కువ ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల్లో వినియోగించే ఆస్పర్టేమ్, శాకరైన్, సుక్రలోజ్, నియోటేమ్ వంటి కృత్రిమ చక్కెరలతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. సహజ చక్కెరకు బదులు కృత్రిమ చక్కెర వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 13 శాతం పెరుగుతుందని వెల్లడైంది. పారిస్లోని ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్, మెడికల్ రిసెర్చ్, సార్బొన్నె పారిస్ నోర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇలాంటి చక్కెరలతో బ్రెస్ట్ క్యాన్సర్, ఊబకాయానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఫ్రాన్స్లో 1,02,865 మందిపై ఈ అధ్యయనం జరిపారు. వీరందరి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అధిక మోతాదులో కృత్రిమ చక్కెరలు ముఖ్యంగా ఆస్పర్టేమ్, ఏస్సల్ఫేమ్-కె తీసుకున్న వారిలో ఎక్కువ శాతం క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని గుర్తించారు.
ఎందులో ఉంటాయి..?
సాధారణంగా కృత్రిమ చక్కెరలు సాధారణ చక్కెరతో పోలిస్తే తక్కువ క్యాలరీలను, ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా ఆహారపదార్థాల్లో తయారీదారులు వినియోగిస్తారు. సుక్రలోజ్ అనే కృత్రిమ చక్కెర సాధారణ చక్కెరతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్లు, బేకరీ పదార్థాలు, క్యాండీలు, చాక్లెట్లు, జామ్లు, జెల్లీలు, పొడితో తయారుచేసిన ద్రవాల్లో ఈ చక్కెరలు వాడుతారు. ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు ఈ రకం చక్కెరలను ఎక్కువగా వినియోగిస్తుంటారు.