టొరంటో: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 20 వేల మంది శరణార్థులకు ( Refugees ) తమ దేశంలో ఆశ్రయం కల్పించనున్నట్లు కెనడా వెల్లడించింది. తాలిబన్ల నుంచి ప్రాణహాని ఎదుర్కొంటున్న ఆ దేశానికి చెందిన మహిళా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆశ్రయం ఇవ్వనున్నట్లు కెనడా చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కెనడా మౌనంగా ఉండలేదని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో మెడిసినో తెలిపారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పారిపోతున్న దీనులను శరణార్థులగా స్వీకరించనున్నట్లు కెనడా తెలిపింది. ఈ జాబితాలో మానవహక్కుల నేతలు, మైనార్టీలు, జర్నలిస్టులు కూడా ఉండనున్నారు. ఇప్పటికే ఏడు విమానాల్లో శరణార్థుల తరలింపు మొదలైంది. టొరంటో తొలి విమానం ల్యాండ్ అయినట్లు మంత్రి మార్కో తెలిపారు. పలు పట్టణాలను చేజిక్కించుకున్న తాలిబన్లు.. కాబూల్ ఆక్రమణ దిశగా ముందుకు వెళ్తున్నారు. కెనడా ఎంబసీలో ఉండే సిబ్బందిని తమ దేశానికి తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు కూడా తమ ఎంబసీల్లో ఉన్న సిబ్బందిని తమ తమ దేశాలకు తరలిస్తున్నాయి.