ఒట్టావా: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ను మళ్లీ నిందించారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, ఇతర మిత్ర దేశాలను కోరారు. రూల్ ఆఫ్ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఈ వివాదం ఇరుదేశాల మధ్య అగ్గి రాజేసింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
అయినా ట్రూడో ఈ వివాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్ను నిందించారు. దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తునకు సహకరించేలా భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.