ఒట్టావా: దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్లైన్కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పని చేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది. (Canada Moves Diplomats) కెనడాలో ఉన్న భారత్ దౌత్యాధికారుల సంఖ్యకు అనుగుణంగా సుమారు 41 మందిని అక్టోబర్ 10 నాటికి తొలగించాలని కెనడాకు భారత్ డెడ్లైన్ విధించింది. ఈ నేపథ్యంలో భారత్లోని పలు ప్రాంతాల్లో ఉన్న కెనడా రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న దౌత్యాధికారుల్లో చాలా మందిని మలేషియా లేదా సింగపూర్కు ఆ దేశం తరలించినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
కాగా, జూన్లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే అతడి హత్య వెనుక భారత సంస్థల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్లో అన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా నుంచి వెళ్లగొట్టారు.
మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. అలాగే కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సంబంధాలు మరింతగా దిగజారడంతో కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించేందుకు అక్టోబర్ 10 వరకు భారత్ గడువు ఇచ్చింది.