టెహ్రాన్: అమెరికాతో శాంతి చర్చలు విఫలం కావడం వల్ల ఇరాన్లో పరిస్థితులు మరింత సంక్షోభంగా మారినట్లు తెలుస్తోంది. ఇరానీ మాజీ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) అంత్యక్రియలు ఇంత వరకు నిర్వహించలేదు. మార్చిలో జరగాల్సిన సంతాప ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంకా ఎప్పుడు ఆయన పార్దీవదేహాన్ని సమాధి చేస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. అమెరికాతో చర్చలు విఫలం కావడం వల్ల.. కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ పార్ధివదేహాన్ని ఎప్పుడు ఖననం చేస్తారన్న అంశం చర్చకు రావడం లేదు. వాస్తవానికి మార్చిలోనే మూడు రోజుల పాటు ఇరాన్ సంతాపం ప్రకటించింది. కానీ ఇంత వరకు అధికారికంగా ఖమేనీ ఖననం జరగలేదు.
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో సుప్రీంనేత అయతుల్లా ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. అయతుల్లా పార్ధీవ దేహాన్ని ఇంకా సమాధి చేయడం లేదంటే, ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో సంక్షోభంగా తీవ్రంగా ఉన్నట్లు అర్థమవుతోందని ఇరానీ వ్యూహాకర్త డాక్టర్ రమేశ్ సిపెరాడ్ తెలిపారు. అధికార మార్పిడి అంశంపై ఇరాన్లో తర్జనభర్జన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఇరాన్ అమెరికన్ రచయిత అయిన రమేశ్ సిపెరాడ్ ఓ మీడియాతో మాట్లాడుతూ 40 రోజుల దాటినా ఖమేనీ బాడీని ఖననం చేయడం లేదన్నారు. ఇప్పటికే 44 రోజులు అయ్యిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న మొజ్తాబా ప్రభుత్వానికి బహిరంగంగా అయతుల్లా అలీ ఖమేనీ పార్దీవదేహాన్ని ఖననం చేసే కాన్ఫిడెన్స్ లేదని సిపెరాడ్ తెలిపారు.
కొత్త ప్రభుత్వంలో పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు తీవ్రమైన భయం ఉన్నట్లు రమేశ్ సిపెరాడ్ తెలిపారు. సాధారణంగా ముస్లింలు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కేవలం 24 గంటల్లోనే ఖననం చేస్తారు. కానీ అయతుల్లా విషయంలో ఆలస్యం అవుతోందన్నారు. ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడం వల్ల మొజ్తాబా ఇంకా చికిత్స పొందుతున్నారు.