ఇస్తాంబుల్: టర్కీలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల వేలాది సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే గజియాన్టెప్లోని ఓ కొండపై ఉన్న క్యాసిల్ కూడా కుప్పకూలింది. సుమారు 2200 ఏళ్ల క్రితం నాటి ఆ కట్టడం భూకంప తీవ్రతకు శిథిలమైంది. ఖారమన్మారస్లోని పజారుక్ జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది.
Gaziantep Castle, which was built more than 2,200 years ago, collapsed during the earthquake pic.twitter.com/i4GjMKMBwU
— BNO News Live (@BNODesk) February 6, 2023
చరిత్రాత్మకమైన గజియాన్టెప్ క్యాసిల్ చుట్టూ ఉన్న గోడలు కూలిపోయాయి. సెంట్రల్ షాహిన్బే జిల్లాలో ఈ క్యాసిల్ ఉంది. భూకంపం వల్ల గుట్ట మీద ఉన్న క్యాసిల్ శిథిలాలన్నీ రోడ్డుపై పడ్డాయి. భారీ బండరాళ్లు అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
గుట్టపైకి దారి రూట్లో ఉన్న ఐరన్ రేలింగ్స్ అన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. సైడ్వాక్ల వెంట ఆ శిథిలాలు పడ్డాయి. క్యాసిల్ వద్ద ఉన్న రిటేనింగ్ వాల్ కూడా కూలిపోయింది. కొన్ని ప్రదేశాల్లో భారీ స్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. క్యాసిల్ పక్కన ఉన్న చరిత్రాత్మక శిర్వాణి మసీదు డోమ్ కూడా పడిపోయింది. ఈ క్యాసిల్ను పలుమార్లు రెనోవేట్ చేశారు.
టర్కీ భూకంపంలో ఇప్పటి వరకు 900 మందికిపైగా మృతిచెందారు. సిరియాలోనూ ప్రకంపనల ధాటికి భారీ ప్రాణా నష్టం జరిగింది. మృతుల సంఖ్య పదివేలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. టర్కీ, సిరియాలో భూకంపం వల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా వెయ్యి దాటింది.