Cigarette | రోడ్డుమీద సిగరెట్ పీక పడేసిన ఓ వ్యక్తికి ఇంగ్లాండ్లోని ఓ కోర్టు షాకిచ్చింది. ఆ వ్యక్తికి ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్లోని థోర్న్ బరీ టౌన్లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి.. సిగరెట్ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు. దీన్ని గమనించిన స్ట్రీట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అలెక్స్కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అధికారుల ఆదేశాలను అతను లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు అలెక్స్పై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.
కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్కు రూ.55 వేలు జరిమానా విధించారు. సిగరెట్ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.