Covid-19 | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఇటీవల చైనాతోపాటు ఐరోపా దేశాల్లోనూ కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. భారత్లోనూ కొత్త వేరియంట్ సైతం బయటపడింది. వేగంగావ్యాప్తి చెందే అవకాశం ఉన్నా.. తీవ్రమైన సమస్యల బారినపడే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు వారాల్లోనే పూర్తిగా కొవిడ్ బాధితులు కోలుకుంటారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు 411 రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న బ్రిటీష్కు చెందిన వ్యక్తి ఇటీవల కోలుకున్నట్లు పరిశోధకుల బృందం పేర్కొంది. కరోనాతో ఎక్కువ కాలం నుంచి ఓ వ్యక్తి కోలుకోవడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రస్తుతం సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నాడని తెలిపారు.
బాధితుడికి సోకిన వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించి.. అవసరమైన చికిత్స అందించి కొవిడ్ నుంచి రక్షించినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి కరోనా బారినపడడానికి ముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, దీంతో ఆ వ్యక్తి రోగనిరోధక శక్తి బలహీనపడిందని తెలిపారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి కరోనా నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పట్టిందని పరిశోధకులు పేర్కొన్నారు. సదరు బ్రిటిష్ జాతీయుడికి 2020 డిసెంబర్లో కరోనా సోకినట్లు వైద్యుల బృందం పేర్కొంది. అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు చాలాసార్లు కొవిడ్ పరీక్షల్లో పదే పదే పాజిటివ్గా తేలింది. ఈ సమయంలో ఆ వ్యక్తి అనేక రకాల లక్షణాలు నిరంతరం కనిపిస్తూ వచ్చాయి. టెస్టుల్లో మొదట బీఏ.1 వేరియంట్తో బాధపడుతున్నాడని, మ్యుటేషన్ ఉన్న వ్యక్తి ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలో నిపుణులు గుర్తించారు.
బలహీనమైన రోగనిరోధకశక్తి ఉండే వ్యక్తులు ఏడాది, అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల బృందం గుర్తించింది. బీఏ.1 వేరియంట్ బారినపడ్డ వ్యక్తికి కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స అందించారు. ఇవి యాంటీబాడీల చికిత్స మాదిరిగా విస్తృతంగా ఉపయోగించరని, ఇవి ఒమిక్రాన్ వంటి వేరియంట్లపై సమర్థంగా పని చేయవని నిపుణులు తెలిపారు. బాధితుడు కొవిడ్ ఫస్ట్ వేవ్లోనే కరోనా బారినపడడంతో ఈ చికిత్స ద్వారా నయం చేసినట్లు వివరించారు. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదని, ప్రతి ఒక్కరూ కొవిడ్కు వ్యతిరేకంగా నివారణ చర్యలను తీసుకోవాలని పరిశోధకుల బృందం సూచించింది.