లండన్ : బ్రిటన్ ప్రయోజనాలు, విలువలకు చైనా నుంచి సవాల్ ఎదురవుతోందని, డ్రాగన్తో సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ఇక ముగిసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పష్టం చేశారు. చైనాలో పనిచేస్తున్న బీబీసీ జర్నలిస్టుపై షాంఘైలో కొవిడ్ వ్యతిరేక నిరసనలను కవర్ చేస్తుండగా జరిగిన దాడి ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీసిన నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన తొలి కీలక విదేశీ విధాన ప్రసంగంలో డ్రాగన్ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల బ్రిటన్ వైఖరి పరిణితి చెందాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం ఊతంగా ప్రపంచంలో అత్యంత ప్రభావశీలంగా ఎదిగేందుకు డ్రాగన్ పావులు కదుపుతోందని అన్నారు. కఠిన జీరో కొవిడ్ పాలసీపై , స్వేచ్ఛపై నియంత్రణలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను గమనించాలని చైనాకు బ్రిటన్ హితవు పలికింది.
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అరుదుగా జరుగుతాయని, అలాంటివి జరిగితే ప్రపంచం వాటిని గుర్తిస్తుందని, చైనా ప్రభుత్వం కూడా ఈ అంశాలను గమనించాలని కోరుతున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లవర్లీ పేర్కొన్నారు. చైనాలో బీబీసీ జర్నలిస్ట్పై దాడిని బ్రిటన్ ఖండించింది. ఇక కీలక భవనాలపై చైనా తయారీ సెక్యూరిటీ కెమెరాల వాడకాన్ని గతవారం లండన్ నిషేధించింది.