లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో బ్రిటన్ ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఇవాళ మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్లో జూన్ 2020లో కరోనా ఆంక్షలను ఉల్లంఘించి ప్రధాని బోరిస్ జాన్సన్ బర్త్ డేకు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే కరోనా ఆంక్షల ఉల్లంఘన కేసులపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసు కమీషనర్ క్రెసిడా డిక్ తెలిపారు. ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా మెట్రోపాలిటన్ పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు క్రెసిడా చెప్పారు. నెంబర్ 10లో ఉన్న ప్రధాని ఇంట్లో బర్త్డే వేడుకలు జరిగినట్లు డౌనింగ్ స్ట్రీట్ అంగీకరించింది. కరోనా మహమ్మారి సమయంలో డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వ సీనియర్ అధికారి సూ గ్రే విచారణ చేపట్టనున్నట్లు క్యాబినెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బోరిస్ జాన్సన్ ఇచ్చిన విందుల్లో 30 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే కేక్ కటింగ్ సందర్భంగా వారంతా డౌనింగ్ స్ట్రీట్కు వచ్చారు. అయితే ఆంక్షల సమయంలో ఎలా వేడుకలు నిర్వహిస్తారని ప్రధాని బోరిస్ను విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రజల్లోనూ బోరిస్ పట్ల విముఖత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ కేసును చేధించేందుకు లండన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.