రియోడీజెనీరో: దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా వేరియంట్ విజృంభిస్తుండటంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒకేరోజు దేశంలో లక్షా 37 వేల కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ తర్వాత ఒక్కరోజులో ఇంతమంది కరోనా బారినపడటం ఇదే మొదటిసారి. 2021 జూన్లో 24 గంటల వ్యవధిలో నమోదైన లక్షా 15 వేల కేసులే ఇప్పటివరకు అత్యధికం. కాగా, ఫిబ్రవరిలో కరోనా కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2021 చివర్లో దేశంలో రోజుకు సగటున 8 వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో.. పండుగల సీజన్ అయిన క్రిస్టమస్, నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా దేశంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో 2.13 మంది జనాభా ఉన్న బ్రెజిల్లో మంగళవారం రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవడం విశేషం. దేశంలో ఇప్పటివరకు ఆరు లక్షల 20 వేల మంది కరోనా వల్ల మరణించారు. అమెరికా తర్వాత కరోనా బాధితులు ఇంత పెద్దమొత్తం మరణించడం బ్రెజిల్లోనే అవడం గమనార్హం.
కరోనా వ్యాక్సినేషన్ను దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో వ్యతిరేకిస్తున్నప్పటికీ.. 70 శాతం మంది పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నారు. ఇక ఈవారంలో ఐదేండ్లు పైబడిన చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేశ ఆరోగ్యసంస్థ ఏర్పాట్లు చేస్తున్నది.