బ్రసిలియా: బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి, బిలియనీర్ ఎలన్ మస్క్ మధ్య వార్ నడుస్తోంది. కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలని ఇటీవల బ్రెజిల్ సుప్రీం జడ్జి ఆదేశించారు. ఆ కేసులో దర్యాప్తునకు కూడా ఆ జడ్జి ఆదేశించారు. అయితే ఆ ఎక్స్ అకౌంట్లను రియాక్టివేట్ చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఫైట్ మొదలైంది. భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. దేశంలోని కొన్ని ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేయాలని జడ్జి అలెగ్జాండ్రే డీమోరల్స్ ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ అకౌంట్లపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేస్తానని, జడ్జి మోరేల్స్ రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేశారు. అయితే ఇంతకీ ఏయే ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేశారన్న అంశాన్ని ఇప్పటి వరకు బ్రెజిల్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వెల్లడించలేదు.
మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో పరిపాలన సమయంలో.. కొందరు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. బొల్సనారోపై జరిగిన సైనిక కుట్ర కేసును కూడా ఆయన విచారిస్తున్నారు. అయితే జడ్జి మోరేల్స్ పదేపదే రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని, దేశ ప్రజలను కూడా మోసం చేస్తున్నారని మస్క్ తన ఎక్స్ పోస్టులో ఆరోపించారు. తమకు ఆ జడ్జి భారీ జరిమానా విధించారని, మా ఉద్యోగుల్ని అరెస్టు చేస్తానని బెదిరించారని, బ్రెజిల్లో ఎక్స్ అకౌంట్లు యాక్సెస్ లేకుండా చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. దీని వల్ల బ్రెజిల్లో తాము ఆదాయం కోల్పోతామని, ఆఫీసులు మూసుకోవాల్సి వస్తుందని మస్క్ అన్నారు.