Mohinder kaur | లాహోర్, మే 22: ఐదు, పది కాదు సుమారు 75 సంవత్సరాలు తర్వాత ఒక మహిళ తన సోదరుడిని కలిసిన భావోద్వేగ క్షణాలవి. ఆ ఆరుదైన దృశ్యానికి సిక్కుల పవిత్ర స్థలమైన ఖర్తార్పూర్ కారిడార్ వేదిక అయ్యింది. భారత్లో ఉంటున్న మహేందర్ కౌర్ (81), పాకిస్థాన్లోని ఆక్రమిత కశ్మీర్లో ఉంటున్న 78 ఏండ్ల షేక్ అబ్దుల్ అజీజ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. తన తమ్ముడిని చూసి ఆలింగనం చేసుకున్న కౌర్ అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యాలను చూసిన ఇరు కుటుంబాలు పాటలు పాడుతూ, వారిపై పూలను చల్లుతూ, స్వీట్లు పంచుతూ ఆ అనంద క్షణాలను వారితో పంచుకున్నారు.
సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్లోని పంజాబ్లో నివసించేది. అయితే దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో ఇండియాలోనే ఉండిపోగా తప్పిపోయిన అజీజ్ ఆక్రమిత కాశ్మీర్కు వెళ్లిపోయాడు. అక్కడే అతను వివాహం చేసుకోని నివసిస్తున్నా నిత్యం భారత్లోని తన తల్లిదండ్రులు, బంధువులు, సోదరి కోసం తపించేవాడు. కాలక్రమేణా ఇంక కుటుంబ సభ్యుల గురించి ఆశలు వదులుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కారణంగా తన వారిని గుర్తించాడు. దీంతో తన తోబుట్టువును కలుసుకునేందుకు వచ్చాడు. వీల్ చైర్ల మీద వచ్చిన ఇద్దరూ కలిసిన ఉద్విగ్న దృశ్యాలను ఇరు కుటుంబాల వారు ఆనందంగా వీక్షించి వేడుక జరుపుకున్నారు.