Brain Surgery | బోస్టన్, మే 4: వైద్యరంగంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్రచికిత్స చేసేందుకు నూతన విధానాన్ని ఆవిష్కరించారు. బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్, బ్రిఘం, మహిళల దవాఖాన ఆధ్వర్యంలో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గర్భస్థ శిశువుల్లో అరుదుగా వచ్చే వాస్కులర్ వైకల్యానికి సర్జరీ చేసి తల్లీబిడ్డలను రక్షించారు.
గర్భస్థ శిశువుల్లో మెదడుకు వచ్చే ఈ వ్యాధిని గాలెన్ వైకల్యం అని అంటారు. మెదడులో పొరలుగా మారిన ధమనులు కేశ నాళికలకు బదులుగా నేరుగా సిరలకు అనుసంధానం అయినప్పుడు ఏర్పడే స్థితినే గాలెన్ వైకల్యం అంటారు. దీని కారణంగా రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. తద్వారా రక్తపీడనం ఎక్కువై సిరలపై ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగించి, కణజాలాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం శిశువు పుట్టాక సర్జరీ చేస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా శిశువు చనిపోతున్నారు. దీంతో ఈ సమస్యకు కొత్త చికిత్స విధానం అనివార్యంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్న బోస్టన్ దవాఖాన వైద్యుల బృందం.. 34 వారాల పిండానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.