కాబూల్, అక్టోబర్ 8: అఫ్గానిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కుందుజ్ ప్రావిన్స్లో రక్తం ఏరులైంది. షియా తెగ ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ పట్టణంలోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకొన్నాడు. ఈ శక్తిమంతమైన పేలుడులో 46 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలు, రక్తంతో మసీదంతా భీతావహంగా ఉందని, మసీదు మెట్లపై నుంచి రక్తం నీళ్లలాగా పారుతుండగా చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. షియా ముస్లింలే లక్ష్యంగా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయని తాలిబన్ సీనియర్ నేత జబియుల్లా ముజాహిద్ చెప్పారు. తాలిబన్ ప్రత్యేక దళాలు కుందుజ్ చేరుకొన్నాయని, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. షియాల భద్రతకు తాలిబన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు.
విస్తరిస్తున్న ఐసిస్
మసీదులో ఆత్మాహుతి దాడి తమ పనేనని ఐసిస్ ప్రకటించింది. దాడికి పాల్పడింది వీగర్ ముస్లిం అని ఐసిస్ ప్రకటనను బట్టి తెలుస్తున్నది. చైనాలో షిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్లపై చైనా అణచివేత ధోరణి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ షియాలే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్లో ఇదే తరహా దాడులకు పాల్పడింది. ఉత్తర అఫ్గానిస్థాన్లోని కుందుజ్లో షియా తెగకు చెందిన హజారాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వీరి జనాభా 6%. వీరిని లక్ష్యంగా చేసుకొని ఐసిస్ గతంలో అనేక ఉగ్రదాడులకు పాల్పడింది. తాలిబన్లు అఫ్గాన్ను ఆక్రమించుకొన్నప్పటి నుంచి దాడులను మళ్లీ వేగవంతం చేసింది. ఆగస్టు 26న కాబూల్ ఎయిర్పోర్టుపై జరిపిన దాడిలో 169 మంది అఫ్గాన్లు, 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. ఇటీవల కాబూల్, హెరాత్ ప్రావిన్సుల్లో మసీదుల్లో ఐసిస్ దాడులు జరిపింది.